Sunday, April 12, 2020

రామతత్వం పరమాత్మ ధర్మం

*వేదవేద్యే పురేపుంసీ జాతే ధశరధాత్మజే* 
 *వేద: ప్రాచేత సాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన:* 

ఉపాసన విషయం లో ఒక్కో అధిష్ఠాన దేవతకి ఒక్కో రకమైన ప్రత్యేకత ఉంటుంది.... 

రామ తత్వాన్ని తీసుకుంటే రాముని భక్తుడిగా ఉండటం అంత ఆషామాషీ వ్యవహారం మాత్రం కాదు... 
ఎందుచేత ఈ మాట అంటున్నారు అనంటే సాక్షాత్తు ధర్మదేవత కి ప్రతిరూపమై భూమిపై నడయాడిన స్వరూపం శ్రీ రామ చంద్ర స్వామి...

ఎంత ఉపాసన చేసినప్పటికీ  ఎంత ఆరాధ్య భావాన్ని ప్రకటించుకున్నప్పటికినీ ఆ స్వామి ని అర్థం చేసుకుని ఆయన భక్తుడిగా కడదాక కొనసాగగలగడం నిజం గా కత్తిమీద సామే......

శ్రీ రామ చంద్ర స్వామి కి భక్తాగ్రేసరుడైన కంచర్ల గోపన్న గారు కూడా రామ భక్తుడిగా ఎన్నో పరీక్షలను ఎదుర్కొన్న విషయం మనం గుర్తుంచుకోవాలి... 

తన జీవితం అంతా రామ భక్తి కోసం పరితపించిన మహనీయుడికి కూడా పరీక్ష తప్పలేదు... 

చరసాలలో వేసినా క్షరాన్నాన్ని పెట్టినా ఆయన రాముడికోసమే తపన పడినాడు తప్ప నాస్తికుడిగా మారలేదు... 

ఇంత పిలిచినా వేడుకున్నా తనకు రాముడు దర్శనం ఇవ్వలేదని ఏడిచినా కూడా ఆ రామచంద్ర స్వామి తన దర్శనాన్ని తానీషా కే ముందుగా ఇచ్చాడు... 

ఆ సమయంలో సామాన్య భక్తులైతే వెంటనే నన్ను కొట్టి ఖైదు చేసిన తానీషా పై ఉన్న పాటి కరుణ కూడా నా మీద లేదా అంటూ అసలు నువ్వు దేవుడివేనా అంటూ భక్తి మార్గాన్ని తెంచుకుని దారి తప్పినా ఆశ్చర్యం లేదు...
 రామదాసు గారు కూడా ఎంతో దుఖ్ఖించారు.. ప్రాదేయపడినారు

నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి నను బ్రోవమని చెప్పవే... అంటూ అమ్మ కి చెప్పి సేద తీరారు...

అలాంటి రామదాసు గారికి చివరకు మోక్షం ప్రసాదించిన దైవం కూడా ఆ రామ చంద్రుడే...

చివరగా చెప్పేదేమంటే ధర్మ మార్గం లో నడవగలిగిన ధైర్యం ఉన్నవాడే నీతి నిజాయితీ లకు కట్టుబడిన నాడే పితృవాక్య పరిపాలనా ప్రాజ్ఞుడిగా మారిన నాడే  మనం ఆ రామభద్రుని పాదాలను కడదాకా మనసు లో నిలుపుకోగలం.. ..

అలా నిలుపుకోవడమే నిజమైన పరిణతి తో కూడిన భక్తి అవుతుంది...

 ఎన్ని యుగాలు మారినా పదునాలుగు భువన భాండమ్ముల నిండా దశ దిశలలోనూ పరివ్యాప్తమై ఉన్నది రామతత్త్వం ఒక్కటే.

No comments:

Post a Comment