Saturday, July 25, 2020

Srimadramayana

 తార " లక్ష్మణా! ఎందుకు అంత కోపంగా ఉన్నావు?  నీకు ఇంత కోపం తెప్పించడానికి సాహసించిన వాళ్ళు ఎవరు? ఎండిపోయిన చెట్లతో కూడిన వనాన్ని దావాగ్ని దహించేస్తుంటే దానికి ఎదురు వెళ్ళగల మొనగాడు ఎవరు? " అన్నది.             
లక్ష్మణుడు " నీ భర్త యొక్క ప్రవర్తన ఆయన భార్యవైన నీకు తెలియడము లేదా?  నీ భర్త ధర్మాన్ని పక్కన పెట్టేసి కేవలము  కామమునందే కాలాన్ని గడుపుతున్నాడు. (మనకి ధర్మ, అర్ధ, కామ, మోక్షాలు అని నాలుగు పురుషార్ధములు ఉంటాయి. ధర్మబద్ధమైన అర్ధము ( కష్టపడి సంపాదించినది) ధర్మబద్ధమైన కామము (కేవలం తన భార్య అందే కామసుఖాన్ని అనుభవించడము) వలన మోక్షము వైపు అడుగులు వేస్తాము. ధర్మాన్ని పక్కన పెట్టి మనం ఎంత డబ్బు సంపాదించినా ఎన్ని సుఖములు అనుభవించినా ప్రమాదమే వస్తుంది). మిత్రుడికి ఇచ్చిన మాట తప్పాడు. నాలుగు నెలల సమయము  గడిచిపోయింది.
న చింతయతి రాజ్యార్థం నాఽస్మాన్ శోక పరాయణాన్ |
సామాత్య పరిషత్తారే  పానమేవోపసేవతే ||
రాజన్నవాడు అనుభవించాల్సింది కేవలము కామము ఒక్కటే కాదు. రాజు మొట్టమొదట మంత్రి పరిషత్తుతో కూడి సమాలోచన చేసి రాజ్యకార్య నిర్వహణ చెయ్యాలి. ఇవన్నీ నీ భర్త చేస్తున్నాడా? వర్షాకాలంలో వెతకడానికి కష్టంగా ఉంటుంది కాబట్టి ఈ నాలుగు నెలలు సుఖములను అనుభవించి నాలుగు నెలల తరువాత స్నేహితుడికి ఇచ్చిన మాట ప్రకారము  సహాయము చెయ్యమంటే ఇచ్చిన సమయము  గడిచిపోయినా ఇంకా కామసుఖాలని అనుభవిస్తూ ఉన్న సుగ్రీవుడిది దోషం కాదా? ఇవ్వాళ నీ భర్త నిరంతర మధ్యపానం చేస్తుండడంవలన ఆయన బుద్ధియందు వైక్లబ్యము ఏర్పడింది. మధ్యపానమునందు రమిస్తున్న సుగ్రీవుడు పురుషార్ధములయందు చెడిపోయాడు " అన్నాడు.
 తార " నాయనా! ఇది కోపగించవలసిన కాలం కాదు. ఎవరో బయటివాళ్ళు చెడిపోతే నువ్వు కోపంతో గట్టిగా కేకలు వెయ్యచ్చు నిగ్రహించవచ్చు చంపవచ్చు. ఇవ్వాళ నీ అన్నతో సమానమైన సుగ్రీవుడు కామానికి బానిస అయ్యాడు. అటువంటి సుగ్రీవుడి మీద నీకు ఇంత కోపం తగదు  'సుగ్రీవుడిది దోషము' అని నువ్వు చెప్పినది పరమ యదార్ధము. నువ్వు గుణములు ఉన్నవాడివి కనుక సుగ్రీవుడిని క్షమించు.  లక్ష్మణా! నువ్వు చాలా గుణాలు ఉన్నవాడివి. నీకు  శాస్త్ర మర్యాద తెలుసు. నా భర్త చాలా అల్పమైన గుణములు ఉన్నవాడు. కామమునకు లొంగిపోయాడు. మరి నువ్వు కోపమునకు లొంగిపోతున్నావేమిటి ?
లక్ష్మణా! నువ్వు ప్రత్యేకించి ఇక్కడికి వచ్చి అరుస్తున్నావు. రాముడు బాణం వేస్తే ఆ ప్రభావము ఎలా వుంటుందో నాకు తెలుసు. సుగ్రీవుడు ఎంత విలువైన కాలాన్ని చేజార్చుకున్నాడో నాకు తెలుసు. దానివల్ల రాముడు ఎంత బాధపడుతున్నాడో నాకు తెలుసు. ఈ మూడుతప్పులు జరిగాయి కనుక మీకు ఉపకారము ఎలా చెయ్యాలో కూడా నాకు తెలుసు. ఎంతో తీవ్రముగా ఉండే  మన్మధుని బాణముల దెబ్బకి కామానికి ఎంత తొందరగా పడిపోతారో, ఏ కాముని బాణముల దెబ్బకి సుగ్రీవుడు ఇలా ఉన్నాడో, ఆ సుగ్రీవుడు ఎవరి పొందుయందు సంతోషముగా ఉన్నాడో నాకు తెలుసు. శత్రువులని చంపే ఓ లక్ష్మణా! ఇవ్వాళ సుగ్రీవుడు తన ఇంద్రియాలకి లొంగిపోయాడు. ఆయనకి రాముడి మీద ఎటువంటి ద్వేషభావము లేదు. అందుకని నువ్వు ఆయనని క్షమించి తీరాలి.
మహర్షయో ధర్మతపోభికామాః కామానుకామాః ప్రతిబద్ధ మోహాః |
అయం ప్రకృత్యా చపలః కపిస్తు కథం న సజ్జేత సుఖేషు రాజా  ||     
నేను కొత్తగా చెప్పాలా ! నీకు తెలీదా?  సంసారాన్ని విడిచిపెట్టి ఎక్కడికో వెళ్ళి తపస్సు చేసుకునే మహర్షులు ఇంద్రుడు పంపిన అప్సరసలని చూసి కామానికి లొంగి తమ తపస్సులను భ్రష్టు పట్టించుకున్నవారు చాలామంది ఉన్నారు. అంత గొప్ప మహర్షులే కామానికి లొంగిపోయినప్పుడు చపలబుద్ధి కలిగిన వానరుడు కామంతో చెయ్యవలసిన పనిని కొన్ని రోజులు మరిచిపోవడము  పెద్ద విషయము కాదు. సుగ్రీవుడు ఇంతగా కామానికి లొంగిపోయినప్పటికీ కూడా మీకు ఇచ్చిన మాటని నెరవేర్చడానికి ఎప్పుడో ప్రయత్నాలు ప్రారంభించాడు.
లక్ష్మణా! పరాయివాడిలా ఇక్కడే నిలబడి ఉన్నావు. నువ్వు అంతఃపురంలోకి రాకూడదా! నువ్వేమన్నా పరాయివాడివా! సుగ్రీవుడు పడుకున్న మందిరంలోకి వస్తే అంతఃపుర కాంతలు కనిపిస్తారని సందేహిస్తున్నావా! అన్యభావన లేకుండా మిత్రుడితో కూర్చుని మాట్లాడేవాడు చారిత్రము ఉన్నవాడు నడువడి ఉన్నవాడు అంతఃపురంలోకి రావచ్చు ఏమి దోషంలేదు లోపలికి రా " అన్నది.
బంగారు కన్నుతో మెరిసిపోతున్న సుగ్రీవుడు తన తొడ మీద రుమని కూర్చోపెట్టుకొని గట్టిగా కౌగలించుకొని ఉన్నాడు. తెర తీసుకొని లక్ష్మణుడు లోపలికి రాగానే సుగ్రీవుడికి తన దోషం జ్ఞాపకము వచ్చి గబుక్కున ఎగిరి లక్ష్మణుడి దగ్గర వాలి శిరస్సు వంచి అంజలి ఘటించాడు.
సుగ్రీవుడి చూడగానే లక్ష్మణుడికి కోపం వచ్చి " సుగ్రీవా! రాజన్నవాడు ఉత్తమమైన అభిజనంతో కూడి ఉండాలి. జాలికలిగినవాడై ఉండాలి.
 ఇంద్రియములను గెలిచినవాడై ఉండాలి. చేసిన ఉపకారాన్ని మరిచిపోనివాడై ఉండాలి. మాట తప్పనివాడై ఉండాలి. అటువంటివాడిని ఈలోకం రాజని గౌరవిస్తుంది. మిత్రుడి దగ్గర సహాయము పొంది, ఆ మిత్రుడికి తిరిగి ఉపకారం చెయ్యనివాడిని ఈ లోకం క్రూరుడు అని పిలుస్తుంది.
శతమ్ అశ్వానృతే హంతి సహస్రం తు గవానృతే |
ఆత్మానం స్వజనం హంతి పురుషః పురుషానృతే ||
ఎవడైనా గుఱ్ఱం విషయంలో అసత్యం చెబితే (అంటే  ఎవరికన్నా గుఱ్ఱము ఇస్తానని చెప్పి ఇవ్వకుండా ఉండడం) నూరు గుఱ్ఱములని చంపిన పాపము వస్తుంది. ఆవు విషయములో అసత్యం చెబితే వెయ్యి ఆవుల్ని చంపిన పాపము వస్తుంది. ఉపకారము చేస్తానని చెప్పి ఆ మాటకి కట్టుబడనివాడు తన బందువులందరిని చంపి వారిని తినేసి తననితాను చంపుకున్నవాడితో సమానమవుతాడు. ఒకరి దగ్గరికి వెళ్ళి ' అయ్యా! మీరు నాకు ఉపకారం చెయ్యండి, నేను మీకు ప్రత్యుపకారం చేస్తాను ' అని మాట పుచ్చుకొని వారి దగ్గరినుండి ఉపకారమును పొంది దాని ఫలితాన్ని అనుభవిస్తూ తాను ఇచ్చిన మాట మరిచిపోయినవాడిని లోకం అంతా కలిసి చంపేస్తుంది.
బ్రహ్మఘ్నే చ సురాపే చ చోరే భగ్నవ్రతే తథా |
నిష్కృతిర్విహితా సద్భిః కృతఘ్నే నాస్తి నిష్కృతిః ||
బ్రహ్మహత్య చేసినవాడికి, మధ్యపానము చేసినవాడికి, దొంగతనము చేసినవాడికి, ఒక వ్రతం చేస్తాను అని చెయ్యడము మానేసినవాడికి ప్రాయశ్చిత్తము ఉండవచ్చు. కృతఘ్నుడికి ప్రాయశ్చిత్తము లేదు. నువ్వు రాముడికి ఉపకారం చేస్తానని ఒప్పుకున్నావు కాని ప్రత్యుపకారము  చెయ్యలేదు. నీ ప్రవర్తన చూసి మా అన్నయ్య నిన్ను మంచివాడు అనుకున్నాడు. నువ్వు కప్పలా అరుస్తున్న పామువని మా అన్నయ్య కనిపెట్టలేకపోయాడు. నువ్వు మా అన్నయ్యకి చేసిన దోషానికి నిన్ను ఇప్పుడే చంపేస్తాను. నీ మాట మీద నువ్వు నిలబడు. లేకపోతే వాలి వెళ్ళిన దారిలో వెళ్ళవలసి ఉంటుంది " అని లక్ష్మణుడు అన్నాడు.
లక్ష్మణుడు మాట్లాడుతున్నంతసేపు నక్షత్రముల మధ్యలో ఉన్న చంద్రుడిలా సుగ్రీవుడు తన భార్యల మధ్యలో చేతులుకట్టుకొని నిలబడిపోయి ఉన్నాడు. తార " లక్ష్మణా! నీ నోటి వెంట సుగ్రీవుడి గురించి ఇటువంటి మాటలు రాకూడదు. సుగ్రీవుడు కుటిలుడు కాదు. అసత్యవాది కాదు. ఇంద్రియనిగ్రహము లేనివాడు,  శఠుడు కాదు. రాముడు చేసిన ఉపకారము  సుగ్రీవుడు ఎన్నడూ మరిచిపోలేదు. రాముడు చేసిన ఉపకారము వల్లనే సుగ్రీవుడు ఈనాడు ఇంత గొప్ప రాజ్యాన్ని, ఐశ్వర్యాన్ని, రుమని, నన్ను పొందగలిగాడు. చాలా కాలం సుఖాలకి దూరముగా ఉండడం వలన సుగ్రీవుడు ఈనాడు సమయాన్ని మరిచిపోయాడు. నా భర్తేనా అలా మరిచిపోయినవాడు? విశ్వామిత్రుడంతటివాడు కూడా కామానికి లొంగి సమయాన్ని మరిచిపోయాడు కదా! ఏ రుమయందు, ఏ రాజ్యమునందు, నా యందు ఆనందముతో సుగ్రీవుడు ఈనాడు సమయాన్ని మరిచిపోయాడో, అదే సుగ్రీవుడు రామకార్యము కోసం అవసరమైతే నన్ను, రుమని, రాజ్యాన్ని వదిలేస్తాడు. రావణుడు యుద్ధంలో నిహతుడవుతాడు. చంద్రుడితో రోహిణి కలిసినట్టు కొద్దికాలంలోనే సీతమ్మ రాముడితో కలవడము సుగ్రీవుడు చూస్తాడు.

శత కోటి సహస్రాణి లంకాయాం కిల రాక్షసాః |
అయుతాని చ షట్ త్రింశత్ సహస్రాణి శతాని చ ||
నాయనా! లంకలో నూరు వేల కోట్ల రాక్షసులు(1 ట్రిలియన్), మరియు 36 వేల సంఖ్యలో( ఒక్కొక్క సంఖ్యలో 100 మంది సైనికులు) బలగాలు ఉన్నాయి. వాలి బతికి ఉన్నప్పుడు ఈ విషయాలని నాకు చెప్పాడు. నాకు పూర్తిగా తెలియదు. అంతమంది రాక్షసులని మట్టుపెట్టడానికి మనకి కూడా కొన్ని కోట్ల కోట్ల వానర సైన్యం అవసరముంది. అందుకని సుగ్రీవుడు వానర సైన్యం కోసం కబురుపెట్టాడు. నువ్వు బాణ ప్రయోగము  చేస్తాను అంటుంటే, ఆనాడు రాముడి బాణానికి వాలి పడిపోయిన సంఘటన గుర్తుకువచ్చి ఇక్కడున్నటువంటి స్త్రీలందరూ భయపడుతున్నారు. నువ్వు ఇలా ప్రవర్తించకూడదు. నీ కోపాన్ని విడిచిపెట్టు " అన్నది.             
లక్ష్మణుడు " అమ్మా! నువ్వు చెప్పిన మాట యదార్ధమే. నేను అంగీకరిస్తున్నాను. ఇక నేను కోపంగా మాట్లాడను. నేను ప్రసన్నుడను అయ్యాను " అన్నాడు.
లక్ష్మణుడి మాటలు విన్న సుగ్రీవుడు ఆనందముతో తన మెడలో ఉన్న పుష్పహారాలని పీకేసి " లక్ష్మణా! నేను రాజ్యాన్ని, భార్యని పోగొట్టుకున్నాను. రాముడి అనుగ్రహముతో వాటిని పొందాను. కేవలం తన చూపు చేత, బాణ ప్రయోగం చేత రాముడు లంకని కాల్చేయగలడు.  రాముడికి సహాయం చెయ్యడానికి నేను ఎంతటి వాడిని. ' నా రాముడే కదా ' అని ప్రేమ చేత కాలాన్ని మరిచిపోయాను అనో లేకపోతే  వానర సైన్యానికి కబురు పంపించాను కదా ' అన్న విశ్వాసంతో మరిచిపోయాననో నేను కాలాన్ని మరిచిపోయిన మాట యదార్ధమే. ప్రపంచములో పొరపాటు చెయ్యనివాడు అంటూ ఉండడు కదా! నన్ను క్షమించు " అన్నాడు. లక్ష్మణుడు " సుగ్రీవా! నువ్వు మా అన్నయ్యకి నాథుడిగా ఉన్నావు. నీవంటి వాడి నీడలో ఉన్న రాముడి పని జరిగి తీరుతుంది. అపారమైన శక్తి ఉండి తిరగబడకుండా తప్పు జరిగితే ఇలా చేతులు కట్టుకొని క్షమించమని అడగగలిగే ధార్మికమైన బుద్ధి మా అన్న రాముడి దగ్గర ఉన్నది. నీ దగ్గర ఉన్నది. ఆ ప్రస్రవణ పర్వత గుహలో బాధపడుతున్న నీ స్నేహితుడిని ఓదార్చు. మా అన్నయ్య బాధపడుతున్నాడన్న బాధతో కోపానికి లొంగి నిన్ను అనకూడని మాటలు ఏమైనా నేను అని ఉంటే  నన్ను క్షమించు " అన్నాడు.
 సుగ్రీవుడు హనుమంతుడిని పిలిచి " ఈ భూమండలములో ఎక్కడెక్కడ ఉన్న వానరాలు ఇక్కడికి రావాలని చెప్పాను. వాళ్ళని కేవలం పది  రోజులలో రమ్మని చెప్పండి. మలయ, హిమాలయ, మహేంద్ర, వింధ్య మొదలైన పర్వతాల మీద ఉన్నవాళ్లు ఇక్కడికి వచ్చెయ్యాలి. కాటుక రంగులో ఉన్నవారు, బంగారు రంగులో ఉన్నవారు, వెయ్యి ఏనుగుల బలం కలిగినవారు, పది ఏనుగుల బలం కలిగినవారు, నీటిమీద నడిచేవారు, నీళ్ళల్లో ఉండేవారు, పర్వతాల మీద ఉండేవారు, చెట్ల మీద ఉండేవారు మొదలైన వానరములన్నిటికి కబురు చెయ్యండి " అని చెప్పాడు.
సుగ్రీవుడి ఆజ్ఞప్రకారము మంత్రులు మొదలైనవారు వానరములను తీసుకురావడానికి వెళ్ళారు. అలా వెళ్ళినవారు అన్ని ప్రాంతాలలోని వానరములని కూడగట్టుకొని కిష్కిందకి పయనమయ్యారు.
సుగ్రీవుడు పల్లకిలో తనతోపాటు లక్ష్మణుడిని ఎక్కించుకొని ప్రస్రవణ పర్వతానికి చేరుకున్నాడు. ఇంతకాలానికి ప్రభువు బయటకి వచ్చాడని అక్కడున్న వానరములు కూడా బయటకి వచ్చాయి.  రాముడి దగ్గరికి వెళ్ళి తన శిరస్సు రాముడి పాదాలకి తగిలేటట్టు పాదాభివందనము చేశాడు. రాముడు సుగ్రీవుడిని కౌగలించుకొని " ధర్మము, అర్థము, కామము వీటికోసం కాలాన్ని విడదీసుకోవడములోనే ఎవరిదైనా ప్రాజ్ఞత ఉంటుంది. కేవలము  కామమునందే జీవితాన్ని నిక్షిప్తము చేసుకున్నవాడు చెట్టు చివరి కొమ్మమీద నిద్రపోతున్నవాడితో సమానము " అన్నాడు.
 సుగ్రీవుడు " రామా ! నువ్వు ఇచ్చినదే ఈ రాజ్యం, ఈ భార్య, కాని నేను కృతఘ్నుడను కాదు. కొన్ని కోట్ల వానరాలు, భల్లూకాలు మొదలైనవి వచ్చేస్తున్నాయి. వీటన్నిటితో ఏ కార్యము చెయ్యాలో నన్ను శాసించు " అన్నాడు.
రాముడు " నీవంటి మిత్రుడు దొరకడము నా అదృష్టం. సీత ఈ భూమండలము మీద ఎక్కడ ఉన్నది? ప్రాణములతో ఉన్నదా" ప్రాణములు తీయబడినదా!అసలు ఏ పరిస్థితులలో ఉన్నదో అన్న జాడ ముందు కనిపెట్టాలి.  వానరాలని అన్నిదిక్కులకి పంపించి అన్వేషణ జరిగేటట్టుగా  చూడు " అన్నాడు.
ఇంతలో అక్కడికి కోట్ల కోట్ల వానరములు వచ్చాయి. అవి రావడము వలన ఆ ప్రాంతమంతా దుమ్ము ధూళితో నిండిపోయింది. అంతా గోలగోలగా ఉన్నది. ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. కొంతమంది నమస్కారాలు చేస్తున్నారు. కొంతమంది చెట్లమీద ఉన్నారు. కొంతమంది నీళల్లో ఉన్నారు. కొంతమంది పర్వతాలమీద ఉన్నారు.
వానర రాజైన సుగ్రీవుడు అందరినీ సరిగ్గా నిలబడమన్నాడు. వానరములు తమని ఎవరెవరు తీసుకొచ్చారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిలబడ్డాయి. " ఎవరు ఎంతమందిని తెచ్చారో నాకు చెప్పండి " అని సుగ్రీవుడు ఆదేశించాడు.
వాళ్ళు " సూర్యాస్తమయ పర్వతమునుండి పది కోట్ల వానరములు వచ్చాయి. శతబలి అనే వానరుడు పదివేల కోట్ల వానరములతో వచ్చాడు. సుషేణుడు లెక్కపెట్టలేనన్ని వానరములతో వచ్చాడు. రుమ తండ్రి కొన్నివేల కోట్ల వానరములతో, హనుమంతుడి తండ్రి కేసరి కొన్నివేల కోట్ల వానరములతో, గవాక్షుడు వెయ్యి కొండముచ్చులతో, ధూమ్రుడు రెండువేల కోట్ల భల్లూకములతో వచ్చాడు, పనసుడు మూడుకోట్ల వానరములతో వచ్చాడు.
 నీలుడు పదికోట్ల నల్లటి దేహం కలిగిన వానరములతో వచ్చాడు. గవయుడు ఐదు కోట్ల వానరాలతో వచ్చాడు, దరీముఖుడు వెయ్యి కోట్ల వానరములతో వచ్చాడు. మైంద-ద్వివిదులు అశ్విని దేవతల్లా వెయ్యి కోట్ల వానరాలని తెచ్చారు, గజుడు మూడు కోట్ల వానరములను, జాంబవంతుడు పది కోట్ల భల్లూకములని తెచ్చాడు. రుమణుడు నూరు కోట్ల వానరములను  తెచ్చాడు. గంధమాదనుడు పదివేల కోట్ల వానరములతో వచ్చాడు. ఆయన వెనకాల లక్ష కోట్ల వానరములు వస్తున్నాయి. అంగదుడు వెయ్యి పద్మ వానరములను, నూరు శంకు వానరములను తీసుకొచ్చాడు. తారుడు ఐదుకోట్ల వానరములను తీసుకొచ్చాడు. ఇంద్రజానువు పదకొండు కోట్ల వానరాలని తెచ్చాడు. రంభుడు పదకొండు వందల  ఆయుత వానరాలని తెచ్చాడు. దుర్ముఖుడు రెండు కోట్ల వానరములని తెచ్చాడు. హనుమంతుడు కైలాశ శిఖరముల్లా ఎత్తుగావున్న వెయ్యి కోట్ల వానరములను తెచ్చాడు. నలుడు నూరు కోట్ల వెయ్యిమంది వందమంది వానరములతో వచ్చాడు. దధిముఖుడు పది కోట్ల వానరములతో వచ్చాడు.
పదివేలకోట్లయితే ఒక ఆయుతం, లక్ష కోట్లయితే ఒక శంకు, వెయ్యిశంకువులయితే ఒక అద్భుదం, పదిఅద్భుదములయితే ఒక మధ్యము, పది మధ్యములయితే ఒక అంత్యము, ఇరువది అంత్యములయితే ఒక సముద్రం, ముప్పది సముద్రములయితే ఒక పరార్థం, అలాంటి పరార్థములు కొన్ని వేలు ఉన్నాయి " అని అన్నారు.

సుగ్రీవుడు వినతుడు అనే వానరమును పిలిచి " వినతా! నువ్వు లక్షమంది వానరములతో బయలుదేరి తూర్పుదిక్కుకి వెళ్ళు. నీకు నెల రోజుల సమయము ఇస్తున్నాను. నెల రోజులలో సీతమ్మ తల్లి జాడ కనిపెట్టాలి. మీరు ఇక్కడినుండి తూర్పు దిక్కుకి బయలుదేరి గంగ, సరయు, కౌశికి, యమున, సరస్వతి, సింధు మొదలైన నదులని, వాటి తీరములలో ఉన్న ప్రాంతాలని అన్వేషించండి. బ్రహ్మమాల, విదేహ, మాలవ, కాశి, కోసల, మాగధ, పుణ్డ్ర, అంగ దేశములలో ఉండే పట్టణాలని, జనపదాలని వెతకండి. వెండి గనులు కలిగిన ప్రదేశాలు అక్కడ ఉన్నాయి. ఆ ప్రదేశాలన్నీ వెతకండి. సముద్రాలలో గల పర్వతాలు, వాటి మధ్యలో గల ద్వీపాలు, అందులో ఉన్న నగరాలు, మంధరాచల శిఖరము మీద కలిగినటువంటి గ్రామములలో నివసిస్తున్న జనుల యొక్క ఇళ్ళు, అక్కడ కొంతమందికి చెవులు ఉండవు. కొంతమందికి పెదవులు చెవుల వరకూ వ్యాపించి ఉంటాయి. కొంతమంది జుట్టు చెవుల వరకూ పడి ఉంటుంది. వాళ్ళందరూ చాలా భయంకరమైన నరభక్షకులు. వాళ్ళు నీళ్ళల్లో ఉంటారు. మీరందరూ ప్రతి చోట సీతమ్మని వెతకండి. కొంతదూరం వెళితే యవద్వీపం కనపడుతుంది. అ

ది రత్నములతో నిండి ఉంటుంది. మీరు అక్కడ వెతకండి. తరువాత సువర్ణ ద్వీపము, రూప్యక ద్వీపము ఉంటాయి. అవి బంగారము, వెండి గనులకు నిలయమైనటువంటివి. అది దాటితే శిశిరం అనే పర్వతం కనపడుతుంది. ఆ పర్వతం అంతా వెతకండి.
కొంతదూరము వెళ్ళాక శోణానది కనపడుతుంది. ఆ నది చాలా లోతుగా, ఎర్రటి నీటితో ఉంటుంది. ఆ ప్రదేశములో సిద్ధులు, చారులు విహరిస్తూ ఉంటారు. అక్కడున్న ఆశ్రమాలలో, తపోవనాలలో సీతమ్మని ఉంచాడేమో వెతకండి. తరువాత ఇక్షు సముద్రము వస్తుంది. అందులో మహాకాయులైన అసురులు ఉంటారు. వాళ్ళు ఆకలిని తీర్చుకోడానికి ప్రాణుల నీడని పట్టి బక్షిస్తుంటారు. అది దాటాక లోహితము అనే మధు సముద్ర తీరాన్ని చేరుకుంటారు. అక్కడ బూరుగు వృక్షములు చాలా సంఖ్యలో పెరిగి ఉంటాయి. అందుకని ఆ ద్వీపాన్ని శాల్మలీ ద్వీపం అంటారు. అక్కడున్న గిరి శిఖరాలకి మందేహులు అనే రాక్షసులు తలక్రిందులుగా వేలాడుతూ ఉంటారు. వాళ్ళు సూర్యుడు ఉదయించే సమయంలో, సూర్యుడు ఉదయించకుండా ఆయనని గ్రసించే ప్రయత్నం చేస్తుంటారు. అక్కడున్న బ్రాహ్మణులు సంధ్యావందనము చేసి అర్ఘ్యం విడిచిపెడితే, ఆ జలముల యొక్క శక్తి చేత, సూర్యుడి శక్తి చేత ఆ మందేహులు అనే రాక్షసులు సముద్రములో పడిపోతుంటారు. అప్పుడు వాళ్ళు మళ్ళీ లేచి ఆ పర్వతానికి తలక్రిందులుగా వేలాడుతూ ఉంటారు. ఆ సముద్ర మధ్యలో ఋషభము అనే పెద్ద పర్వతము ఉంటుంది. ఆ పర్వతం మీద సుదర్శనము అనే పేరుగల గొప్ప సరోవరం వెండి కాంతులతో విరాజిల్లుతూ ఉంటుంది. దానిని దాటితే క్షీరసముద్రము వస్తుంది. దానిని కూడా దాటితే మధుర జలములు కలిగిన మహాసముద్రము వస్తుంది. అందులో ఔర్వుడు అనే మహాముని యొక్క కోపం బడబాగ్నిగా పుట్టి సముద్రములో ప్రవేశించింది. దానికి హయముఖము అని పేరు.
దానిని దాటి ముందుకి ఒక పదమూడు యోజనముల దూరం వెళితే ఒక బంగారు పర్వతము కనపడుతుంది. దానికి జాతరూప శిలము అని పేరు. దానిమీద సర్పాకృతి కలిగిన అనంతుడు నల్లటి బట్టలు ధరించి కూర్చొని ఉంటాడు. ఆయనే ఆదిశేషుడు. ఆయన పక్కనే తాటి చెట్టు ఆకారంలో ధ్వజం పెట్టబడి ఉన్నది. దాని పక్కనే ఒక వేదిక ఉన్నది. దానిని దేవతలు నిర్మించారు. మీరు ఆ ఆదిశేషుడిని దర్శించి ముందుకి వెళితే బంగారు పర్వతమైన ఉదయాద్రి కనపడుతుంది. ఆ పర్వతము నూరు  యోజనముల వరకూ విస్తరిస్తూ ఆకాశాన్ని తాకుతూ ఉంటుంది. దానిని దాటి వెళితే సౌమనసం అనే ధృడమైన బంగారు శిఖరము ఉంటుంది. అక్కడే బ్రహ్మగారు భూమండలానికి ద్వారాన్ని ఏర్పాటు చేశారు. అక్కడే సూర్యుడి మొదటి కిరణ ప్రసారము  ప్రారంభమవుతుంది. అది దాటి వెళితే కటిక చీకటి. ఇక్కడిదాక అంగుళము విడిచిపెట్టకుండా సీతమ్మ జాడ వెతకండి. తూర్పు దిక్కుకి వెళ్ళే వానరములు సిద్ధం అవండి " అన్నాడు.
సుగ్రీవుడు " నీలుడు, హనుమంతుడు, జాంబవంతుడు, సుహోత, శరారి, శరగుల్ముడు, గజుడు, గవాక్షుడు, గవయుడు, మైందుడు, ద్వివిదుడు, గంధమాదనుడు, ఉల్కాముఖుడు, అనంగుడు, హుతాశరుడు మొదలైనవారందరికి నాయకుడిగా యువరాజైన అంగదుడు బయలుదేరి దక్షిణ దిక్కుకి వెళ్ళండి. మీతో పాటు కొన్ని లక్షల వానరములను  తీసుకువెళ్ళండి. వెయ్యి శిఖరములు కలిగిన వింధ్యపర్వతానికి వెళ్ళి ఆ పర్వతము అంతా వెతకండి. గోదావరి నది, కృష్ణవేణి, వరదానదిలో వెతకండి. తరువాత మేఖల దేశము, ఉత్కల దేశము, దశార్ణ నగరము, భద్రవంతీ, అవంతీ నగరాలని వెతకండి.

నదీం గోదావరీం చైవ సర్వమేవానుపశ్యత |
తథైవాంధ్రాంశ్చపుండ్రాం శ్చ చోళాన్ పాండ్యాన్ కేరళాన్ ||
విదర్భ,రుష్టిక, మాహి, కళింగ, కౌశిక,కుంభ,చేర, చోళ, పాండ్య, కేరళ మొదలైన రాజ్యాలన్నీ వెతకండి. కావేరి నదిని దాటండి. మలయ పర్వత శిఖరం మీద అగస్త్యునికి విశ్వకర్మ నిర్మించిన గృహం ఉంటుంది. ఆ ప్రాంతాన్ని వెతకండి. తరువాత మొసళ్ళతో ఉన్న తామ్రపర్ణీ నదిలో వెతకండి. ఆ తరువాత సముద్రం వస్తుంది. ఆ సముద్రంలోకి చొచ్చుకుపోయిన శిఖరములతో మహేంద్రగిరి పర్వతము కనపడుతుంది. ఆ సముద్రానికి నూరు  యోజనముల అవతల ఒక ద్వీపం ఉన్నది. దానిని కాంచనలంక అంటారు. ఆ లంకా పట్టణాన్ని రావణాసురుడనే పది తలల రాక్షసుడు పరిపాలిస్తున్నాడు. అక్కడ మీరు చాలా జాగ్రత్తగా వెతకాలి. ఆ తరువాత సముద్రాన్ని దాటితే పుష్పితము అనే పర్వతము కనపడుతుంది. అది దాటితే సూర్యవత్, వైద్యుతం అనే పర్వతాలు కనపడతాయి. ఆ పర్వతాల మీద ఉండే చెట్లకి కాచిన పళ్ళు చాలా బాగుంటాయి. అవి తినండి. ఆ తరువాత కుంజరం అనే పర్వతం కనపడుతుంది. దాని మీద విశ్వకర్మ అగస్త్యుడికి బ్రహ్మాండమైన భవనం నిర్మించాడు. అలా ముందుకి వెళితే భోగవతి అనే నగరం వస్తుంది. అందులో విషంతో కూడుకున్న పాములు ఉంటాయి. అక్కడే సర్పాలకి రాజైన వాసుకి ఉంటాడు. ఆ తరువాత ఎద్దు ఆకారములో ఉన్న వృషభ పర్వతం కనబడుతుంది. దానిమీద గోశీర్షకము, పద్మకము, హరిశ్రావము అనే మూడు రకాల చందనం కనపడుతుంది. అగ్నితుల్యము అనే చందనం కూడా ఉంటుంది. మీరు పొరపాటున కూడా ఆ చందనాన్ని ముట్టుకోకండి. అక్కడ శైలూషుడు, గ్రామణి, శిగ్రువు, శుభ్రువు, బభ్రువు అనే ఐదుగురు గంధర్వ రాజులు పరిపాలన చేస్తుంటారు. మీరు వారికి నమస్కారము చేసి ముందుకి వెళితే, పృద్వికి చివరన పుణ్యం చేసుకున్నవారు స్వర్గానికి వెళ్ళేవారు కనపడతారు. అదికూడా ద

ాటిపోతే పితృలోకం వస్తుంది. ఇక అది దాటితే యమధర్మరాజు యొక్క సామ్రాజ్యము ఉంటుంది. అక్కడ పాపులు ఉంటారు. మీరు అది దాటి వెళ్ళలేరు. దక్షిణ దిక్కున అక్కడిదాకా వెళ్ళి వెతికిరండి " అన్నాడు.
తరువాత సుగ్రీవుడు సుషేణుడిని పిలిచి ఆయనకి నమస్కరించి " మీతో పాటు మరీచి మహర్షి యొక్క కుమారుడైన అర్చిష్మంతుడు, అర్చిర్మాల్యుడు మొదలైన వానరాలని తీసుకొని పడమర దిక్కుకి వెళ్ళండి. అప్పుడు మీరు సౌరాష్ట్ర, బాహ్లిక, చంద్ర, కురు, మల్ల, పాంచాల, కోసల, అంగ, మగధ, అవంతి, గాంధార, కాంభోజ మొదలైన రాజ్యాలు, పట్టణాలు, గ్రామాలు వెతకండి. అలాగే అవంతీపురం, జటాపురం కనపడతాయి, వాటిని కూడా వెతకండి. సిందు-సాగర సంగమ స్థానంలో, నూరుశిఖరాలతో, పెద్ద చెట్లతో సోమగిరి అనే పర్వతం కనపడుతుంది. మీకు ఆ పర్వతం మీద రెక్కలున్న సింహాలు కనపడతాయి, అవి ఏనుగుల్ని ఎత్తుకుపోతుంటాయి. సముద్రంలోని తిమింగలాలని ఎత్తుకుపోతుంటాయి. అక్కడ సముద్రంలో పారియాత్రం అనే పర్వతము ఉన్నది. అది వంద యోజనముల విస్తీర్ణములో ఉంటుంది. దానిమీద ఇరవైనాలుగు కోట్ల మంది గంధర్వులు ఉంటారు. వాళ్ళకి నమస్కారము  చేసి ముందుకి వెళ్ళండి. అప్పుడు మీకు నూరు యోజనముల ఎత్తయిన వజ్ర పర్వతము  కనపడుతుంది. సముద్రములో నాలుగోవంతు భాగంలో చక్రవంతము అనే పర్వతం ఉంటుంది. దానిమీద విశ్వకర్మ వెయ్యి అంచుల చక్రాన్ని నిర్మించాడు. ఆ చక్రాన్ని ఎవరూ తీసుకోకుండా చేస్తున్న హయగ్రీవుడు అనే రాక్షసుడిని శ్రీ మహావిష్ణువు చంపి ఆ చక్రాన్ని తీసుకున్నారు.  పంచజనుడు అనే మరొక రాక్షసుడిని చంపి శంఖాన్ని తీసుకున్నారు.

No comments:

Post a Comment